ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిలువునా ముంచారు: నాదెండ్ల మనోహర్

• రిటైర్డ్ ఉద్యోగుల మట్టి ఖర్చులను కూడా మిగుల్చుకోవడం అమానుషం
• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాగ్ పొగిడిందని గొప్పలు చెప్పుకొని… ఇప్పుడు ఆర్థిక కష్టాలు అంటారా?

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పోలీసుల్లో ఆశలు రేపి ఇప్పుడు నిలువునా దగా చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. పి.ఆర్.సి. ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగుల నుంచి.. ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం కాబట్టి వెనక్కి ఇవ్వాలని చెప్పిన పాలకులను ఎప్పుడూ చూడలేదు. జీతాల పెంపుదలపై పదేపదే సంఘాలను చర్చలకు పిలిచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను మభ్యపెట్టారు. ఐ.ఆర్. కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇంటి అద్దె భత్యాలను తగ్గించడం, ఉద్యోగులకు రావాల్సిన డి.ఏ.లను గతంలో ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వాటి రూపంలో వసూలు చేసుకొంటామని చెప్పడం చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి పాలన చేస్తున్నట్లుగా లేదు. కాల్ మనీ, వడ్డీ వ్యాపారులు తమ బకాయిలను వసూలు చేసుకొనే విధానమే కనిపిస్తోంది. పోలీసులు తమ బాధలను పంటి బిగువున ఉంచుకొంటున్నారు. వారికి సక్రమంగా టి.ఏ.లు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి స్థితిలో జీతభత్యాలు తగ్గించడంతో వారు మరింత వేదనకు లోనవుతున్నారు. ఉపాధ్యాయులకు బోధన విధుల కంటే ఇతర విధులు పెంచి జీతాలు తగ్గించడం దురదృష్టకరం.

• సీఎస్ లెక్కలు విచిత్రంగా ఉన్నాయి

జీతాల పెంపుదల గురించి అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పిస్తున్నారు. పి.ఆర్.సి వల్ల జీతం పెరిగిందని చెప్పడం విచిత్రంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి ముందుకు వస్తూ… ముఖ్యమంత్రి తరఫున చర్చలు చేసే ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఇప్పుడు ఎందుకు తప్పించుకొని దాక్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఫోన్ ద్వారా ‘కంట్రోల్’ లో ఉండేలా చేసిన ఆ పెద్దమనిషి ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశారో ఉద్యోగులు నిలదీయాలి. ఆర్థిక పరిస్థితి గురించి చర్చల సమయంలోనే ఎందుకు చెప్పలేదు? కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆదాయం బాగుందని కాగ్ పొగిడిందంటూ గొప్పలు చెప్పుకొన్న పాలకులు ఇప్పుడు మాత్రం పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు?

• పెన్షనర్ల కన్నీళ్లు తుడిచేది ఎవరు?

రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ తగ్గే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం భావ్యం కాదు. ఉద్యోగులో, పెన్షన్ అందుకొనేవారో, వారి జీవిత భాగస్వామో చనిపోతే.. అంత్యక్రియల నిమిత్తం ఇచ్చే మట్టి ఖర్చులను కూడా తొలగించడం అమానుషం. 2019లో వైసీపీ ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి మట్టి ఖర్చులను చెల్లించే విధానం ఆపేశారు. ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు. అలాగే 70సం. పైబడినవారికి ఇచ్చే క్వాంటమ్ పెన్షన్ అర్హతను 80సంవత్సరాలుగా మార్చడం వృద్ధాప్యంలో ఉన్నవారిని బాధపెట్టడమే అవుతుంది. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలపై ఇచ్చిన అర్థరాత్రి జీవోలను తక్షణమే రద్దు చేయాలి. ఆశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను ఉద్యోగులకు ఇవ్వాలి. జీతాల పెంపుపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.