నటి నిధిఅగర్వాల్‌కు గుడి కట్టి, పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్..

అందాల నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే క్రేజీ అవకాశం చేజిక్కించుకుంది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి ఊహించని గిఫ్ట్ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టి, ఏకంగా పాలభిషేకం చేశారు అభిమానులు. ఆ విషయాన్ని స్వయంగా నిధినే చెప్పింది. ఇంత ప్రేమను అస్సుల ఊహించలేదని, జన్మజన్మలకు గుర్తుపెట్టుకుంటానని చెప్పింది.

ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళనాడులో ఓ చోట నిధి అగర్వాల్ విగ్రహానికి, కొందరు తెలుగు, తమిళ ఫ్యాన్స్ పాలతో అభిషేకం చేశారు. ఆ ఫొటోల్ని కొందరు నిధికి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. ఈ అనూహ్య పరిణామంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. గతంలో తమిళంలో ఎమ్​జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు. నిధి అగర్వాల్ తమిళంలో నటించిన తొలి రెండు చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికే విడుదలయ్యాయి. ‘భూమి’ ఓటీటీలో, ‘ఈశ్వరన్’ థియేటర్లలో రిలీజైంది.