తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయం. ఈ విజయం కోసం ఎంతోమంది ప్రాణాలు ధారబోశారు. మరెందరో తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగాల ఫలమే నేటి మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సాధనలో అశువులు బాసిన వీరులకు వందనాలు తెలుపుతున్నాను. ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ. పాలకుల అణిచివేత, దాష్టీకాలను ఎదిరించే లక్షణం ఈ నేల సొంతం. ఈ లక్షణం దేశంలోని ప్రజలందరికీ ఆదర్శం. పోరాడితేనే లక్ష్యం సిద్ధిస్తుందని ఎలుగెత్తి చాటింది తెలంగాణ ఉద్యమం. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోరుకున్నారో ఆ లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.