సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన హీరో అక్షయ్ కుమార్‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తో భేటీ అయ్యారు. ముంబై ట్రైడెంట్ హోటల్‌లో మంగళవారం ఆయన ముఖమంత్రిని కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యూపీ సీఎం మంగళవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్షయ్‌ తన అప్‌ కమింగ్‌ మూవీ “రామ్ సేతు” పై చర్చించినట్టు సమాచారం. రామ్ సేతు పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను అక్షయ్‌ ఇటీవల విడుదల చేశారు. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ప్రధానంగా ఫిల్మ్‌సిటీ ప్రణాళికల గురించి చర్చించిన మొదటి వ్యక్తులలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. వీరిద్దరూ చర్చలు జరుపుతున్న ఫొటోస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

కాగా, లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (ఎల్‌ఎంసి) గత నెలలో బాండ్ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించింది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన లక్నో మున్సిపల్‌ బాండ్ల లాంచింగ్‌ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్‌ హాజరుకాగా.. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ బాండ్లను లిస్టింగ్ చేసిన సందర్భంగా గంట కొట్టారు.

మరోవైపు యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీనిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఏడాది సెప్టెంబరులో  ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఫిలింసిటీ ఏర్పాటుపై  చర్చించేందుకుఆదిత్యనాథ్ బుధవారం బాలీవుడ్ చిత్రనిర్మాతల ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు నిర్మాత రాహుల్ మిత్రా  తెలిపారు.  ప్రముఖ  నిర్మాతలు సుభాష్ ఘాయ్, బోనీ కపూర్, రాజ్‌కుమార్ సంతోషి, సుధీర్ మిశ్రా, రమేష్ సిప్పీ, టిగ్‌మన్‌షు ధులియా, మాధుర్ భండార్కర్, ఉమేష్ శుక్లా, టీ సిరీస్  అధినేత భూషణ్ కుమార్, పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గడా, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్  తదితరులు వీరిలో ఉన్నారు.