చెన్నై సూపర్ కింగ్స్‌పై హైదరాబాద్ విజయo

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదిరే విజయం సాధించింది. శుక్రవారం జరిగిన IPL 2020లో 14వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై  హైదరాబాద్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి పంచ్‌ ఇస్తూ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యువ బ్యాట్స్‌మన్‌ ప్రియాం గార్గ్‌ (51 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు అర్థ సెంచరీతో తొలుత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 164/5 పరుగుల స్కోరు సాధించింది. అభిషేక్‌ శర్మ (31, 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), డెవిడ్‌ వార్నర్‌ (28, 29 బంతుల్లో 3 ఫోర్లు), మనీశ్‌ పాండే (29, 21 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. 165 పరుగుల ఛేదనలో సూపర్‌కింగ్స్‌ చెన్నై విఫలమైంది.  హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆరంభంలోనే చెన్నై స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరారు. షేన్‌ వాట్సన్‌ (1), అంబటి రాయుడు (8), కేదార్‌ జాదవ్‌ (3) నిష్క్రమణలతోనే మ్యాచ్‌పై చెన్నై ఆశలు కోల్పోయింది. ఎం.ఎస్‌ ధోని (47 నాటౌట్‌, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆఖరు వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. 157/5 పరుగులే చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.