పీఎంవో డిప్యుటీ సెక్రటరీగా ఐఏఎస్ ఆమ్రపాలి

గతంలో తెలంగాణలో ఐఏఎస్ అధికారిణిగా పలు ప్రాంతాల్లో సేవలందించి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. ఆమ్రపాలితో పాటు డైరెక్టర్ గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్టియాల్ ను నియమిస్తూ, క్యాబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2010 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ కలెక్టర్ గా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించారు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియేట్ లో డిప్యూటీ కార్యదర్శి హోదాలో ఉన్నారు.