అభిమానులు లేకపోతే పవన్‌ కల్యాణ్ లేడు.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వకీల్‌ సాబ్‌..

వకీల్ సాబ్.. ఇప్పుడు టాలీవుడ్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ అనేక ఆసక్తి విషయాలు అభిమానులతో పంచుకున్నారు. తాను ఎప్పుడూ నటుడు కావాలని వెంపర్లాడలేదన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు సీఎం పదవి కోసం కూడా ఆత్రుతపడటం లేదన్నారు. తనకు అభిమానుల గుండెల్లో ఉన్న స్థానం చాలని.. చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. మూడేళ్లు సినిమా చేయలేదన్న బాధ తనకు ఏ రోజు కలగలేదన్నారు. ఎందుకంటే ఏ పనిచేసినా దేశం కోసం.. జనం కోసం చేసుకుంటూ వెళ్లిపోయానన్నారు.

ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదేళ్లు దాటి పోయిందంటే నమ్మశక్యంగా లేదని.. అభిమానులు లేకపోతే పవన్‌ కల్యాణ్ లేడని ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు. తాను ఏమాత్రం అండదండలు లేని సమూహం నుంచి వచ్చిన వాడినని.. మీ గుండె చప్పుడు అర్థం చేసుకోగలనని.. మిమ్మల్ని గౌరవించి మీ ఆనందం కోసం పరితపించేవాడినని చెప్పారు. ఒక్కోసారి మీకు తగ్గట్లుగా సినిమా చేయకపోవచ్చు.. కానీ ఎక్కువ సినిమాలు చేసి.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అన్నయ్య చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే తాను రాజకీయాల్లో వచ్చానని.. ఇంటర్మీడియట్‌ తప్పిన తాను జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతానని చెప్పారు. తనకు తెలిసిన మొదటి వకీల్‌ నానీ పాల్కీ వాలా అని మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆయన పోరాట ప్రతిమ అద్భుతమని కొనియాడారు. అప్పటి నుంచి లాయర్‌ వృత్తిపై తనకు గౌరవం ఏర్పడిందన్నారు. వకీల్‌సాబ్‌లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చివరగా ఓ పంచ్‌ డైలాగ్ కూడా ఒదిలారు.. సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. పాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటే లేనిది తాను సినిమాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు..? అంతేకాకుండా అవినీతి చేయకుండా ఉండేందుకే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. డబ్బు సంపాదించడం కోసం సినిమాలు చేయడం లేదని.. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నంత వరకు నటిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్‌ 9 న విడుదలయ్యే సినిమాను అందరు ఆదరించాలని కోరారు.