షీ ట్యాక్సీల దరఖాస్తుకు ఆహ్వానం..

ఉపాధి కల్పిండంతో పాటు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం షీ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్యాక్సీ నడుపుకునే మహిళలకు వాహనాల కొనుగోలు కోసం సబ్సిడీ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ క్రమంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ జిల్లాలో షీ ట్యాక్సీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సీడీపై ట్యాక్సీలను అందించనున్నారు. 10వ అర్హత ఉండి, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ అమౌంట్‌తో మొత్తం 45 శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను అందించనున్నారు. ఇక అర్హత సాధించిన మహిళలకు నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి క్యాబ్‌ డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని అక్కేశ్వర్‌ రావు సూచించారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా సీడీపీవో కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.