ఐపీఎల్ ఛాంపియన్‌ ముంబై

మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్​తో ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసి మళ్లీ టైటిల్ అందుకుంది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది. ముంబై సారథి రోహిత్ శర్మ (68) అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్నందించాడు. ఢిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది రోహిత్​సేన.

టార్గెట్ ఛేదనకు దిగిన ముంబై మెరుపు వేగంతో దిగింది. డికాక్ (20/ 12 బంతుల్లో, మూడు 4, నాలుగు 6), రోహిత్ ముందు నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే అయిదో ఓవర్‌లో డికాక్‌ను స్టాయినిస్‌ బోల్తాకొట్టించాడు.

కాగా, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో ముంబై పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్‌ స్పిన్నర్లకు బంతి అందించడంతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసర పరుగుకు రోహిత్‌ ప్రయత్నించగా.. సూర్యకుమార్ కెప్టెన్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ముంబై విజయం దిశగా సాగింది. రోహిత్‌, పొలార్డ్‌ (9) స్వల్పవ్యవధిలోనే ఔటైనా ఇషాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, రబాడ, స్టాయినిస్‌ చెరో వికెట్ తీశారు.