IPL2021: బెంగళూరుపై పంజాబ్‌ ఘన విజయం..

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు అదిరే విజయం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన పంజాబ్‌ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. 180 పరుగుల ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులే చేసింది.

ఛేదనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(35: 34 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రజత్‌ పటిదార్‌(31: 30 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌), హర్షల్‌ పటేల్‌(31: 13 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ దేవదత్‌ పడిక్కల్‌(7), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(0), ఏబీ డివిలియర్స్‌(3), షాబాజ్‌ అహ్మద్‌(8), డేనియల్‌ సామ్స్‌(3) ఘోరంగా విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ మూడు, రవిబిష్ణోయ్‌ రెండు వికెట్లు తీయగా మెరిడిత్‌, మహ్మద్‌ షమీ, జోర్డాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు రాహుల్‌(91 నాటౌట్‌: 57 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు ) సూపర్‌ హాఫ్‌సెంచరీతో రాణించడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. హార్డ్‌హిట్టర్‌ క్రిస్‌గేల్‌(46: 24 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌(25 నాటౌట్‌: 17 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా డేనియల్‌ సామ్స్‌, యుజువేంద్ర చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్ పడగొట్టారు.