ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 11 రోజులుగా కొనసాగుతున్న కాల్పులకు తెరపడింది. ఈ రెండింటి మధ్య జరుగుతున్న హింసలో 200 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లోనూ పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై వందలాది రాకెట్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ గాజాను లక్ష్యంగా చేసుకుని వాయు దాడులకు దిగింది.

ఇజ్రాయెల్ దాడితో భయకంపితులైన పాలస్తీనియన్లు వేలాదిమంది గాజాను వీడి వెళ్లిపోయారు. మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. మిత్రదేశమైన అమెరికా నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో మెట్టుదిగిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి నిన్న ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదించింది. కాల్పుల విరమణను హమాస్ వర్గాలు కూడా నిర్ధారించాయి. ఫలితంగా 11 రోజుల పాటు జరిగిన ఘర్షణలు సద్దుమణిగాయి.