భారత్‌లో కరోనా కట్టడికి కొంతకాలం లాక్‌డౌన్‌ విధిస్తేనే మేలు: ఫౌచీ

భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడికి అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో పాటు చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితుల సమగ్ర పర్యవేణకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కొవిడ్‌పై విజయం సాధించామని భారత్‌ ముందే ప్రకటించేసిందని ఫౌచీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశాన్ని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయడం చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడానికి ఏ దేశమూ ఇష్టపడదని.. కానీ, కొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల పెద్ద సమస్యలేమీ తలెత్తవని తెలిపారు. అందుకు ఆయన చైనాను ఉదాహరణగా చెప్పారు. చైనాలో వైరస్‌ విజృంభణ ప్రారంభమైన వెంటనే యావత్తు దేశాన్ని షట్‌డౌన్‌ చేశారని గుర్తుచేశారు. నెలల తరబడి షట్‌డౌన్‌ విధించాల్సిన అవసరం లేదని.. కొన్ని వారాల పాటు అమలు చేస్తే వ్యాప్తి ఆగిపోతుందని వివరించారు. అలాగే వెంటనే ఆక్సిజన్‌, ఔషధాలు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు.

కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్‌ ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఫౌచీ.. 1.4 బిలియన్‌ జనాభా కలిగిన భారత్‌లో ఇప్పటి వరకు రెండు శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి టీకా అందజేశారని తెలిపారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ సంస్థల్ని ఆశ్రయించాలన్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ దేశంగా ఉన్న భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. కీలక వైద్య సరఫరాలను సమకూర్చుకునేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని దానికోసం ఓ కమిషన్‌ లేదా అత్యవసర గ్రూప్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా సహా ఇతర దేశాలు భారత్‌కు దన్నుగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. గతంలో భారత్‌ ఇతర దేశాలకు సాయం చేయడంలో చాలా ఉదారంగా వ్యవహరించిందన్నారు. అదే తరహాలో ఇప్పుడు భారత్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఫౌచీ సూచించారు. చైనాలో ఇదే జరిగిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. తొలుత తక్షణ అవసరాలపైనే దృష్టి పెట్టాలని.. తర్వాతే దీర్ఘకాలిక వ్యూహాలపై ఆలోచించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. భారత్‌ రకం వైరస్‌పై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్లు ఏ మేర పనిచేస్తున్నాయో నిర్ధారించాల్సి ఉందన్నారు. అయితే, ఇప్పటికే కొన్ని సంస్థలు భారత్‌ రకంపై తమ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించాయని గుర్తుచేశారు.