రైతులను చూస్తుంటే బాధగా ఉంది.. సోనూసూద్

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు నేటి తో  24వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, సినిమా తారలు, విపక్ష నేతలు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నటుడు సోనూసూద్ రైతుల నిరసన పై స్పందించారు.

ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సోనూ మాట్లాడుతూ.. రైతులను చూస్తుంటే బాధగా ఉందన్నారు. ” ఈ ఆందోళనలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని నేను చెప్పాలనుకోవడంలేదు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఈ పోరాటంలో కొందరు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. నాకు రైతులతో మంచి అనుబంధం ఉంది. పొలాల్లో సాగు చేస్తూ ఉండాల్సిన రైతులు ఇలా చలికి వణుకుతూ..కుటుంబంతో సహా రోడ్ల పైన ఉన్నారు. ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. వారిని చూస్తుంటే బాధగా ఉంది”. అని సోనూసూద్ అన్నారు.