మహిళలకు ఉన్నత స్థానమిచ్చిన పార్టీ జనసేన

విజయనగరం: ప్రస్థుత రాజకీయాల్లో మహిళలకు ఉన్నత స్థానమిచ్చిన పార్టీ కేవలం జనసేన పార్టీయే అని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. జనసేన పార్టీలో కీలక భాద్యతలు నిర్వహించి, వైసీపిలో చేరిన చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీపై తప్పుడు వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు. విజయనగరంలో స్థానిక నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యప్రకాష్ కు జనసేన పార్టీలో మంచిగుర్తింపునిచ్చినప్పటికీ ఆయన స్వలాభం కోసం వేరే పార్టీలోకి మారారని, అలా మారినప్పుడు వీడిన పార్టీ గూర్చి, పార్టీ అధినేతల గూర్చి విమర్శలు చేయడం సరికాదన్నారు. జనసేన పార్టీలో నాయకులకు, మహిళలకు సరైన గుర్తింపు లేదని వ్యాఖ్యానించడం చాలా దారుణమన్నారు. జనసేన పార్టీలో మంచి పదవుల్లో ఉన్న మాపై సూర్యప్రకాష్ తన స్వలాభం కోసం జిల్లా నాయకులని, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అయిన నా గూర్చి అసత్యాలు మాట్లాడటం సరికాదన్నారు. దీనిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సూర్యప్రకాష్ మా తరపున వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే మునిగిపోతున్న నావ లాంటి పార్టీలో చేరిన సూర్యప్రకాష్ త్వరలోనే ఆ పడవలోనే మునిగిపోతారన్నారు. ఇకనైనా తన స్వలాభం కోసం జనసేన పార్టీపై అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు.