‘ఛలో అంతర్వేది’కి జనసేనాని మద్దతు

బీజేపీ చేపట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమానికి జనసేనానీ మద్దతు పలికారు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం, అంతకుముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో జరిగిన ఈ తరహా సంఘటనల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించందన్నారు పవన్ కల్యాణ్. అందుకే భక్తులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు.

ఈ శుక్రవారం తమకు మిత్రపక్షమైన బీజేపీ ఛలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కరోనా సమయంలో దీన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించామన్నారు. భావోద్వేగాలు, మనోభావాలు కించపరిచారనే ప్రజలు బయటకు వచ్చారని… అలాంటప్పుడు వారితో కలసి నడవాలని  నిర్ణయించినట్టు పవన్ వివరించారు.

శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ శ్రేణులను పవన్ కోరారు. ప్రజల మనసులు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని పేర్కొన్నారు. ఎవరూ భావోద్వేగానికి గురికాకుండా నిరసన తెలియజేయాలని సూచించారు.