కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేత

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం చోటు చేసుకున్న హింసపై కంగనా చేసిన వ్యాఖ్యలు తమ నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ట్విట్టర్ స్పష్టం చేసింది. ఇదొక్కటే కాదని, కంగనా పదేపదే తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, విద్వేషపూరిత వైఖరి, దూషణలతో కూడిన ప్రవర్తన కనబరుస్తున్నారని ట్విట్టర్ వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ తన పాత విశ్వరూపాన్ని ప్రదర్శించి మమతా బెనర్జీని ఓ ఆటాడించాలని కంగనా చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కొరడా ఝుళిపించింది.

కాగా, ట్విట్టర్ తన ఖాతాను తొలగించడంపై కంగనా స్పందించారు. తన గళాన్ని వినిపించడానికి అనేక వేదికలు ఉన్నాయని అన్నారు. తాను స్వయంగా సినీ నటినని, సినిమాల ద్వారా కూడా తన అభిప్రాయాలను వెల్లడించగలనని స్పష్టం చేశారు.