టీఆర్ఎస్‌లో చేరిక సందర్భంగా బ్యానర్ల ఏర్పాటు.. కౌశిక్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా

టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీలో ఆయన చేరికను పురస్కరించుకుని ఆయన అనుచరులు నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే, ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియా ద్వారా పలువురు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వాటిని తొలగించారు. బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేటలో ఏర్పాటు చేసిన బ్యానర్లకు గాను కౌశిక్‌రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు.