ప్రశ్నించే వారంతా దేశ ద్రోహులా..?: సీఎం కేసీఆర్‌

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు.

వాళ్లంతా దేశద్రోహులా..?
”భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ వడ్ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏడాదిగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్‌.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? భాజపానే నియమించిన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆ పార్టీకి చెందిన వరుణ్‌ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్‌ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారు” అని కేసీఆర్‌ అన్నారు.

”పంజాబ్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తుందా? లేదా? కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనిపై సమాధానం చెప్పేదాకా.. కేంద్రాన్ని, భాజపాను వదిలిపెట్టం. రాయలసీమకు వెళ్లి నీరు కావాలని చెప్పిన మాట వాస్తవమే. రాయలసీమకు నీరు ఇవ్వాలని ఈ రోజు కూడా చెబుతున్నా. ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ రాయలసీమకు నీళ్లివ్వాలని చెప్పా. బేసిన్లు, భేషజాలు ఉండొద్దని ఏపీ సీఎంకు చెప్పా. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో ఎన్నికలను బట్టి రాజకీయాలు చేస్తుంటాయి. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? బండి సంజయ్‌ యాసంగిలో వడ్లు వేయాలని చెప్పిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు ఆరు హెలికాప్టర్లు పెడతా. బండి సంజయ్‌, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావాలి. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడ అని బండి సంజయ్‌ ప్రశ్నిస్తున్నారు. అసలు ఉద్యమంలో ఆయనెక్కడ ఉన్నారు? ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజలకు నీ పేరైనా తెలుసా?. భాజపా నేతల కథ తేల్చేదాకా నేను రోజూ మాట్లాడతా. ఇకపై రోజూ కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దేశద్రోహులమా?” అని కేసీఆర్‌ అన్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌వా…?
”మీకు భయపడడానికి మాకెలాంటి వ్యాపారాలు లేవు. దందాలు లేవు. ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. మేమెందుకు భయపడతాం. మాకేం మనీ ల్యాండరింగులు.. బోండరింగులు లేవు. కేసీర్‌ ఫౌమ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వేమైనా ట్రాక్టర్‌ డ్రైవర్‌వా..? అనవసర ప్రయత్నాలు చేస్తే భూమరాంగ్‌ అవుతది జాగ్రత్త” అని బండి సంజయ్‌నుద్దేశించి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ”ఫామ్‌హౌస్‌లో నేను, నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాం. రాష్ట్రం కోసం మా భూములే పోయాయి. మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా? మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పార్టీ నాయకులను తీసుకుంటే తప్పేముంది. అదే మీరు చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యభిచారమా? కాంగ్రెస్‌ నుంచి తీసుకొచ్చిన సింథియాను మీరు కేంద్రమంత్రిని చేయలేదా?” అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

12న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా

”వడ్లు కొనాలని 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. వడ్లుకొనే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టం. భారత్‌ భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారని చెబితే దేశద్రోహులవుతారా? దేశాన్ని కాపాడమన్నోడు దేశద్రోహా.. వదిలేసినోడు దేశద్రోహా? ఏపీలో ఏడు మండలాలను కలిపినప్పుడు మీరెక్కడ ఉన్నారు. దయచేసి రైతులెవరూ వరి వేయకండి. వీళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. విత్తన కంపెనీలతో ఒప్పందాలు ఉన్న రైతులు ధాన్యం పండించుకోండి. ఒకవేళ మిల్లర్లతో మీకు ఒప్పందం ఉన్నా.. నష్టమొచ్చినా పర్లేదు అనుకున్నవారు మాత్రమే వరి వేయండి. మీ మంచి కోసమే మేం చెప్తున్నాం. కేంద్రం పాలసీ సరిగా లేదు కాబట్టే.. ఇవాళ వరి వేయొద్దంటున్నాం. ఒకవేళ కేంద్రం కొంటామని హామీ ఇస్తే వరి వేద్దాం. భాజపా నాయకులు, ఎంపీలు కనిపిస్తే రైతులు వడ్ల కొంటారా? కొనరా? అని ప్రశ్నించాలి. డీజిల్‌ మీద, పెట్రోల్‌ మీద కేంద్రం సెస్‌ ఉపసంహరించుకోవాలి. వెనక్కి తీసుకునే వరు ప్రజల పక్షాన పోరాడతాం. పన్నుల సొమ్ముతో జాతీయ రహదారులు వేశామని చెప్తున్నారు. ఇంతకుముందున్నవి కేంద్ర ప్రభుత్వాలు కావా? వారు ఇలానే చెప్పుకున్నారా?” అని కేసీఆర్‌ అన్నారు.

ప్రతి కుటుంబానికి దళిత బంధు
”హుజూరాబాద్‌లో దళిత బంధును అమలుచేసి తీరుతాం. అక్కడ ప్రతి కుటుంబానికి ఇస్తాం. ఇంతకుముందు చెప్పిన నాలుగు మండలాల్లో కూడా దళిత బంధును అమలౌవుతుంది. ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు ఇస్తాం. మార్చిలోపు ఇవన్నీ ఇస్తాం. వచ్చే బడ్జెట్‌లో రూ.20 లక్షల కోట్లు వెచ్చించనున్నాం. నాలుగైదేళ్లలో రాష్ట్రంలో దళితులందరికి పథకం వర్తింపజేసి వారి అభివృద్ధికి కృషి పనిచేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నాలుగైదు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తాం. 2, 3 రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం చేస్తాం. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తాం. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ కూడా ఇస్తాం” అని కేసీఆర్‌ చెప్పారు.