రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హెచ్చరించారు. బుధవారం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కించ పరుస్తూ ఒక బజారు మనిషి లాగా మాట్లాడడం తగదన్నారు. ప్రొద్దుటూరు నగరానికి ఈయన పొడిచింది ఏమీలేదని, నవరత్నాలు లాగే ఈయన నవదందాలు పేరుతో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. గుట్కా, ఖైని, గంజాయి, మద్యము, క్రికెట్ బెట్టింగ్, ఇసుక మొదలగు అన్ని దందాలు చేసే ఎమ్మెల్యే గా ఘనత సాధించారని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని, అతను మగవాళ్ళను ఆడించలేడు, ఆడవాళ్ళను మాత్రమే అనే కించపరిచేలా మాట్లాడిన మీరు మైక్ ల ముందుకొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారుగా ఇంతకీ మీరు ఆడ, లేక మగనా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యే ఇసుక దందా రికార్డ్ అవుతుందని పోలీసు సీసీ కెమెరాలు కూడా పని చేయకుండా చేసిన అవినీతి మీది అని తెలిపారు. మీరు గంభీరంగా పలికిన మార్కెట్టు, ఒకచేత్తో బేగం, ఒకచేత్తో పట్ట, రామేశ్వరం నుఒచి థర్మల్ రోడ్, పాల కేంద్రము, టెక్స్టైల్ హబ్, ఏమయ్యాయి వాటి మీద మీప్రతాపం చూపమన్నారు. పోలీసు అధికారులు, రిజిస్టర్ లాంటి అధికారులు ప్రొద్దుటూరు నగరానికి రావాలంటే నలభై నుండి యాభై లక్షలు రేటు కట్టిన వ్యక్తి రాచమల్లు గారు అని ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా నోరు పారేసుకుంటే మీ నేర చరిత్ర జిల్లాలో ప్రతి ఇంటికి బుర్రకథ లా వినిపిస్తామన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు.