కుట్రలు కేసులతో జనసేన నాయకులను బెదిరించలేవు అంబటి.. ఖబడ్దార్: గాదె

గుంటూరు: సత్తెనపల్లి జనసేన పార్టీలో సంక్షోభం సృష్టించి బలంగా ఉన్న పార్టీని విచ్చిన్నం చేయాలని చూస్తూ… పార్టీలోని వ్యక్తులచేత కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తే.. ఊరుకునేది లేదని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. సత్తెనపల్లి జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన అంతర్గత విషయాలపై అంబటి రాంబాబు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నాడని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకొక తప్పదని గాదె అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా పార్టీ ఇచ్చిన “బి ఫామ్” పై గెలిచిన రంగిశెట్టి సుమన్ అనే వ్యక్తి పార్టీ వ్యవతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని.. ఉదయం స్థానిక మున్సిపల్ చైర్మన్.. సాయంత్రం అంబటి రాంబాబు వద్ద ఉంటూ.. వారి అజండా అమలు చేయాలని చూస్తే.. ఒప్పుకొనే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్యని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి అందరూ కష్టపడుతున్నారని, అటువంటి వారిపై రంగిశెట్టి సుమన్ చేత కావాలనే అంబటి కేసులు పెట్టించారని, ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదని, రానున్న రోజుల్లో అంబటి అవినీతి పై పోరాటం మరింతగా చేస్తామని అన్నారు. జనసేన కార్యకర్తలు జోలికి వస్తే ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని.. వారికి అండగా ఉంటానని గాదె స్పష్టం చేశారు.