సిద్ధిపేట సోదాలపై కిషన్ రెడ్డి ఫైర్..

దుబ్బాక ఉప ఎన్నికతో సిద్ధిపేటలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో జరిగిన సోదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లక్షల రూపాయల డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం మరింత వేడి రాజేసింది. సిద్ధిపేటలో నెలకొన్న టెన్షన్‌తో పలువురు బీజేపీ నేతలు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

సిద్ధిపేటలో జరిగిన ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు చెబుతామన్న ఆయన… అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ ఇంటికి గత రాత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షించి… కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు సోదాలు చేసిన గదిని పరిశీలించారు.ఈ సందర్భంగా రఘునందన్ రావు జరిగిన ఘటనను కిషన్ రెడ్డికి వివరించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసులు రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారన్నారు.

బీరువాలు, మంచాలు, సూట్‌కేసులు తెరిచి చిందర వందర చేసి దురుసుగా ప్రవర్తించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రఘునందన్‌ రావుతోపాటూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై పోలీసులు దాడి చేశారన్నారు. సిద్ధిపేటలో అసలేం జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు కిషన్ రెడ్డి. అనేక రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో దౌర్జన్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

కార్యకర్తలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు బండి సంజయ్ కూడా సిద్ధిపేట సీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అని చూడకుండా తనను ఎత్తి వ్యానులో పడేస్తారా అంటూ మండిపడ్డారు.