కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు

మంచిలీపట్నం: మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రకు బెయిల్‌మంజూరైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు ఉదయం రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నిన్న కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై 356, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదయం మచిలీపట్నంలోని ఆయన నివాసంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి .. కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేశారు.

అరెస్టులకు భయపడేది లేదు: కొల్లు రవీంద్ర

పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ”ఇదేం న్యాయమని అడిగితే నాపైనే కేసు పెట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని రవీంద్ర అన్నారు.

నిన్న ఏం జరిగిందంటే?                                

ఓటు వేసేందుకు వెళ్లిన తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కారణంతో మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రం వద్ద రవీంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన కొల్లుకు, వైకాపా ఏజెంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు కొల్లును వెళ్లిపోవాలని సూచించడంతో పరిస్థితి ఉద్రిక్తతను సంతరించుకుంది. సహనం నశించిన కొల్లు రవీంద్ర … ప్రజాస్వామ్యంపై గౌరవంతో వ్యవహరిస్తున్న తమను చంపేయాలనుకుంటున్నారా అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. గెలుపు కోసం ఎన్నడూ లేని విష సంస్కృతికి పేర్ని నాని శ్రీకారం చుట్టారని విమర్శించారు.