ఒడిశాలో కలర్ జిరాక్స్ తీసి.. విశాఖకు తరలిస్తున్న రూ. 7.90 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత!

ఒడిశాలో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్టణానికి తరలిస్తున్న రూ. 7.90 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామమైన సుంకి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపిన పోలీసులు అందులో తనిఖీ చేయగా పెద్దమొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. నోట్లను తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న నోట్లలో 1580 కట్టల రూ. 500 నకిలీ నోట్లు రూ. 7.90 కోట్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాయపూర్‌లో వీటిని కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్టణం తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనక ఓ ముఠా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.