పార్లమెంట్ లో పెగాసస్ పై చర్చపెట్టాలని విపక్షాలు ఆందోళన.. ఉభయసభలు వాయిదా

దేవవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్.. ఇప్పుడు పార్టమెంట్ లోను సెగలు రేపుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ పై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విపక్షనేతలు ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఓ బిర్లా వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ బిర్లా.. విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన రీతిలో నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆ అంశంపై సోమవారమే ప్రకటన చేసిందన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. అన్ని అంశాలపై సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ తెలిపారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

ఇక రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో.. సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. పెగాసస్ లాంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను ఎప్పుడైనా కాంగ్రెస్ వాడిందా.. ఇలాంటి గూఢచర్యం గురించి తమకు తెలియదన్నారు. న్యూ ఇండియా మేకింగ్‌కు ఇదో స్ట్రాటజీ అని అధిర్ ఆరోపించారు.