ఆఫ్ఘనిస్థాన్ అంశంలో బైడెన్ నిర్ణయాన్ని సమర్థించిన పాకిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ అంశంలో పాకిస్థాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలు బానిస సంకెళ్లు తెంచుకున్నారంటూ పరోక్షంగా తాలిబన్ మద్దతు వ్యాఖ్యలు చేసిన పాక్ అధినాయకత్వం…. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాన్ని సమర్థించింది.

ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించాలన్న బైడెన్ నిర్ణయంలో తప్పేమీలేదని పాక్ జాతీయ భద్రతా సంఘం పేర్కొంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా సంఘం సమావేశంలో ఈ మేరకు బైడెన్ పంథాను సమర్థించింది. ఇతర దేశాల్లో ఏళ్ల తరబడి విదేశీ దళాలు ఉన్నందువల్ల ఎలాంటి మార్పు రాదన్న విషయం స్పష్టమైందని వ్యాఖ్యానించింది.

ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణకు బైడెన్ అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకున్నారు. అయితే అమెరికా దళాలు వెళ్లిపోతుండడం వల్లే తాలిబన్లు పేట్రేగిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బైడెన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే, పాక్ మాత్రం బైడెన్ కు మద్దతు పలుకుతోంది.