రాష్ట్ర క్షేమం కోసమే పవన్ కళ్యాణ్ తపన!
కొత్తవలస: రాజకీయాలు, పదవుల కంటే రాష్ట్ర క్షేమం కోసం తపించే గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని టీడీపీ కొత్తవలస మండల అధ్యక్షుడు గొరపల్లి రాము పేర్కొన్నారు. జనసేన మండలాధ్యక్షుడు గొరపల్లి రవికుమార్ అధ్యక్షతన కొత్తవలస పట్టణంలో ఆదివారం పార్టీ మండల స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి భారీగా జనసైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కరడుగట్టిన, ఉత్సాహవంతులైన కార్యకర్తలు జనసేన బలమన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జనసేన మండలాధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని జనసైనికులను సంఘటితపరిచి ఒకత్రాటి మీదకు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరం కష్టించి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గ్రామ కమిటీలను నియమించారు. కార్యక్రమంలో జనసేన వేపాడ మండలాధ్యక్షుడు సుంకరి అప్పారావు, కొత్తవలస ఉపాధ్యక్షులు బోగాది దేవా, టీడీపీ నాయకులు బొబ్బిలి అప్పారావు, బంగారి రమేష్, తూరుబిల్లివిజయ్ కుమార్ పలువురు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-05-at-7.55.57-PM-1024x457.jpeg)