పవన్ – రానాల మల్టీస్టారర్

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్`లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాను కూడా త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా పవర్ స్టార్ కు సంబంధించి మరో సినిమా అప్డేట్ వచ్చింది.

పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌ ఇది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పకులు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ క్లాప్‌నివ్వగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందజేశారు. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ”మాసంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. రెగ్యులర్‌ చిత్రీకరణని జనవరిలో మొదలు పెడతాం. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.