అత్యంత ప్రభావ వంతుల జాబితాలో ప్రగతి, అడవి శేష్‌, శ్రీముఖి

న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని ‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో తెలగు పరిశ్రమకు సంబంధించి పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. ఇటీవల ప్రదీప్, రష్మీ తమకు చోటు దక్కిందని సోషల్ మీడియా ద్వారా చెప్పగా, ఇప్పుడు నటి ప్రగతి, నటుడు అడవి శేష్‌, యాంకర్ శ్రీముఖి తమకు ఇందులో చోటు దక్కిందని ప్రకటించారు.

ఆర్ట్స్ – మీడియా – కల్చర్ లకు చెందిన ఆసియాలోని భారత్ పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తుల విజయ కథలను ప్రపంచ వేదికపై జరుపుకోవడం.. వారిని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ జాబితాలో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అగ్ర స్థానంలో నిలిచారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనూ నిగమ్ – రహత్ ఫతే అలీ – అద్నాన్ సమీ – జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉండటం విశేషం. ఈ జాబితాను రెడీ చేయడానికి జర్నలిస్ట్ కిరణ్ రాయ్ యూకే నుంచి జూమ్ ద్వారా 400 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలుస్తోంది.