హౌసింగ్ సిబ్బంది అక్రమాలు అరికట్టండి: సాకే మురళీకృష్ణ

బుక్కరాయసముద్రం మండలం ఏపీ హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఏఈ, మరియు వర్క్ ఇన్స్పెక్టర్ గత 7సంవత్సరాలుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జగనన్న కాలనీలలో ఇష్టానుసారంగా మార్కింగ్ చేస్తూ.. ఇష్టమొచ్చిన వారికి బిల్లులు మంజూరు చేస్తూ.. నిస్సహాయులైన ఒంటరి మహిళలు, వృద్ధులు, నిరుపేదలు హౌసింగ్ సిబ్బందిని బ్రతిమాలుకుంటున్నా.. అహంకారం ధోరణితో రాచరికం పద్ధతితో ప్రజలను పురుగులుగా హీనంగా చూస్తూ 600 మంది లబ్దిదారులకు ఇల్లు రద్దు చేస్తున్నామని తెలిపినారు. ఇదే విధంగా నియోజకవర్గ పరిధిలో 6మండలాల్లో కలిపి 3వేల మందికి పైగా నిరుపేద లబ్దిదారులకు జగనన్న ఇల్లు రద్దు చేయడం జరుగుతుంది అని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సాకే మురళీకృష్ణ ఆవేదన వ్యక్తపరిచారు. ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టిస్తామని మొదట చెప్పి.. ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇల్లు కట్టుకోనివారికి ఇల్లు రద్దు చేయమని ప్రభుత్వం జి. ఓ వచ్చిందనే నెపంతో అధికారులు చేతివాటం, లంచాలు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బి.కే.ఎస్ మండలం లో ఏళ్లుగా పాతుకు పోయిన ఒక మహిళా వర్క్ ఇన్స్పెక్టర్ గత ప్రభుత్వం హయాంలో లంచాలు మరిగి ఏకపక్షంగా ప్రవర్తిస్తుంది. ఆమె మరియు హౌసింగ్ ఏ.ఈ ప్రజలను పీడించి అవమానాలకు, భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ విషయాలు అన్నీ తెలిసిన ఎం.పీ.డీ.ఓ మండల అధికారిణి కూడా బాధ్యత మరిచి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది. కనుక వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు, లబ్దిదారులకు న్యాయం చేయవలెనని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ.. న్యాయం చేయలేని పక్షంలో 3వేల మంది లబ్దిదారులతో కలెక్టరేట్ ను ముట్టడి చేస్తామని సాకే మురళీకృష్ణ హెచ్చరించారు.