బ్లూ జెర్సీలో ఆర్‌సీబీ.. ఎందుకంటే..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాబోయే అన్ని మ్యాచుల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. దేశంలో కొవిడ్‌ మహమ్మారి వ్యతిరేకంగా పగలు, రాత్రి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్నట్లు ఆర్‌సీబీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అలాగే కొవిడ్​తో పోరాడుతున్న దేశానికి అండగా నిలువనున్నట్లు పేర్కొంది. తమ వంతుగా సాయం చేయడమే కాకుండా విరాళాల సేకరణకు కృషి చేస్తామని తెలిపింది. అందుకోసం కొత్తగా తయారు చేసిన బ్లూ కలర్​ జెర్సీని రానున్న మ్యాచ్​ల్లో ధరిస్తామని, వాటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా కోసం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

‘బెంగళూరుతో పాటు దేశంలోని ఏయే ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరత ఉందో.. వైద్య పరికరాల అవసరం ఉందో అక్కడ ఆర్‌సీబీ సాయం అందిస్తుంది. అంతేకాకుండా రానున్న మ్యాచ్​ల్లో ప్రత్యేక జెర్సీ ధరించనున్నాం. గతేడాది కొవిడ్ నియంత్రణలో భాగంగా ముందుండి పోరాడిన ఉద్యోగుల గౌరవార్థం ఈ జెర్సీలను ధరించనున్నాం. వీటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నాం.’ అని ఆర్‌సీబీ షేర్‌ చేసిన వీడియోలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్​లో సోమవారం జరగనున్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​తో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్​ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి.. ఇప్పటికే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌తో పాటు ఐపీల్‌లో ఆడుతున్న పలువురు క్రికెటర్లు, ఫ్రాంచైజీలు మద్దతుగా నిలిచారు.