ఓల్డ్ మలక్‌పేటలో మొదలైన రీ పోలింగ్..

జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమైంది. డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, గుర్తులు తారుమారు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ను వాయిదావేసింది. దీంతో ఇవాళ మరోమారు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఈ డివిజన్‌తోపాటు గ్రేటర్‌లోని 150 డివిజన్ల ఓట్లను రేపు శుక్రవారం లెక్కించనున్నారు.

ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన ఈ పార్టీ అభ్యర్థి పోలింగ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డివిజన్‌ మొత్తం ఎన్నికను నిలిపి వేశారు.