హెక్టార్ పంట నష్టానికి రూ.50 వేలు : సీఎం కేజ్రీవాల్

అకాల వర్షాల ధాటికి నష్టపోయిన పంటకు పరిహారం అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ రాజధాని పరిధిలో ఉన్న వ్యవసాయ దారులకు ఈ పరిహారం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక్కో హెక్టార్‌కు 50,000 రూపాయల చొప్పున అందించనున్నట్లు బుధవారం విడుదల చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ”అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. రైతులు చాలా దు:ఖంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచొద్దు. ప్రభుత్వం వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఒక్కో హెక్టార్‌ చొప్పున 50,000 రూపాయలు అందించాలని అధికారులను నేను ఆదేశిస్తున్నాను” అని అన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ ”కొద్ది రోజుల క్రితం కొంత మంది రైతులు నన్ను కలిశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయామని చెప్పారు. పంట కోల్పోయామని బాధ పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని నేను వారికి భరోసా ఇచ్చాను. గడిచిన ఆరేడేళ్లలో రైతులు చాలా నష్టపోయారు. రైతుల బాధల్ని నేను అర్థం చేసుకోగలను” అని అన్నారు.