పోలీసుల అదుపులో సచిన్ జోషి..

ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి ముంబైకి వచ్చిన సచిన్‌ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా సీజ్ చేశారు. అయితే ఈ కేసులో నిందితులను విచారించగా.. గుట్కా తరలింపు ఘటనలో సచిన్ జోషి హస్తమున్నట్టు నిర్ధారణ అయింది. తాజాగా అతను దుబాయ్ నుంచి ఇండియా రావడంతో ముంబైలో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

“గత మార్చిలో హైదరాబాద్ లో 80 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నాం. మార్కెట్ లో వీటి విలువ లక్షల్లో ఉంటుంది. సచిన్ జోషి పేరు బయటకు రావడంతో అతనిపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే అదుపులోకి తీసుకున్నాం. ఒకవేళ అవసరమైతే మరోసారి సచిన్ జోషిని విచారిస్తాం” అని పోలీస్ వర్గాల వారు చెబుతున్నారు.