మరోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్‌

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మరోసారి సాధారణ ప్రయాణికుడిగా మారి బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా అదే బస్సులో ప్రయాణించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పుష్పక్‌ బస్సులో కుటుంబ సమేతంగా వెళ్లారు. మాసబ్‌ట్యాంక్‌ వరకు ప్రయాణించిన సజ్జనార్‌… బస్సులో సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సజ్జనార్‌ సూచించారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎండీ సజ్జనార్‌. తరచూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులను కలిసి సమస్యలు, సలహాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా తెలపాలని ఇప్పటికే సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ప్రజలను కోరారు. కరోనా ఆంక్షల ఎత్తివేత తర్వాత ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక సజ్జనార్‌ గతంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేశారు సజ్జనార్.