కమల్ హాసన్ కు షాక్.. బీజేపీలో చేరిన MNM ప్రధాన కార్యదర్శి
మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో MNM పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఇవాళ పార్టీని వీడారు. కమల్ హాసన్ రెండో దశ ప్రచారం కార్యక్రమంలో బిజీగా ఉండగా.. అరుణాచలం పార్టీని వీడి బీజేపీలో చేరారు.
శుక్రవారం(డిసెంబర్-25,2020)చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు అరుణాచలం. రైతులకు ఉపయోగకరంగా ఉన్నందున నూతన సాగు చట్టాలకు మద్దతివ్వాలని తాను కమల్ను కోరానని..అయితే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా అరుణాచలం విమర్శించారు.
తూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచలం..తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి పునాది వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన ఎంఎన్ఎంను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అరుణాచలం నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.