‘సన్ ఆఫ్ ఇండియా’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

డాక్టర్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యా నిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం శుక్రవారం మొదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో డాక్టర్‌ మోహన్‌బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.

మేస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం.