అఫ్గానిస్తాన్ పరిణామాలపై కేంద్రం ప్రత్యేక బృందం ఏర్పాటు
అఫ్గానిస్తాన్ విషయంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం మంగళవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా బలగాలు అఫ్గాన్ను పూర్తిగా వీడిన నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.
బృంద సభ్యులుగా కేంద్రమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను నియమించారు. అఫ్గాన్ నుంచి భారతీయులు, మైనారిటీలను తీసుకురావడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించనుంది.