నేటి నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక టీకా డ్రైవ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందికి నేటి నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వీరికి కరోనా టీకా వేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం హైరిస్క్‌ జాబితాలో చేర్చింది. వీరికోసం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక టీకా డ్రైవ్‌ చేపట్టింది. విద్యాసంస్థల్లో పనిచేస్తే ప్రతిఒక్కరు ఈ నెల 30 వరకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని అధికారులు సూచించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయనున్నారు. ప్రతి కేంద్రంలో సీఆర్‌పీ లేదా ఉపాధ్యాయుడు ఒకరు ఉంటారని, సిబ్బంది తమ ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు చూపించి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.