రాష్ట్రంలో రౌడీ గూండా పాలన సాగుతోంది: మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, వైసిపి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ, గూండా పాలన సాగుతుందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. గురువారం ఆయన ఇండేన్ గ్యాస్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వై.యస్ జగన్మోహన్ రెడ్డి తమ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు సెల్ టవర్ సాకు చూపి పర్యటనను అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి గానీ, వైసిపి మంత్రులకు గాని ఏనాడు సెల్ టవర్లు అడ్డు రాలేదా అని ప్రశ్నించారు.అధికార పార్టీకి ఒక న్యాయము, ప్రతిపక్షాలకు మరొక న్యాయమా అని మండిపడ్డారు. జనసేన-టిడిపి కూటమికి ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే తమ నాయకుడి పర్యటనలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది తాము అధికారంలోకి వస్తామని, దౌర్జన్య, నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భాస్కర పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, గోపి, చౌడయ్య, వీరయ్య ఆచారి, కిషోర్, జనసేన వీర మహిళలు శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.