విజయవంతంగా 80కి పైగా దేశాలకు టీకాల సరఫరా..

భారత్‌ ఇప్పటి వరకు 80కి పైగా దేశాలకు కరోనాను నిరోధించే టీకాలను సరఫరా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ.. ఈ కార్యాన్ని విజయవంతంగా కొనసాగించామని పేర్కొన్నారు. అలాగే కరోనా నుంచి మానవాళిని కాపాడేందుకు జరుగుతున్న కృషిలో భారత్‌ తన శక్తి, సామర్థ్యాల మేరకు ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. రైసీనా డైలాగ్‌ 2021 ప్రారంభోపన్యాసంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో 130 కోట్ల మందిని రక్షించుకునేందుకు చర్యలు చేపడుతూనే ఇతర దేశాలకు సాయం అందించామని మోదీ తెలిపారు. మహమ్మారిని రూపుమాపాలంటే మానవాళి మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని భారత్‌ ముందే గుర్తించిందని తెలిపారు. దాదాపు శతాబ్ద కాలం తర్వాత ఈ ప్రపంచం ఓ మహమ్మారిని ఎదుర్కొంటోందని ప్రధాని గుర్తు చేశారు. అయితే, తాజాగా వచ్చిన కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు మాత్రం ఈ సమాజం సంసిద్ధంగా లేదని తెలిపారు. గత ఏడాది కాలంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ వర్గాల కృషి వల్ల కొన్నింటికి పరిష్కారం లభించిందన్నారు. ఇంకా అనేకం అలాగే ఉండిపోయాయన్నారు.