ఒక్కసారి గతంలోకి నడవాలనుంది.. మీ పాట వినాలనుంది.. భావోద్వేగంతో సునీత పోస్ట్‌

ప్రముఖ గాయని సునీత భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎంతగానో అభిమానించే, మావయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గురు పూజోత్సవం సందర్భంగా బాలుతో దిగిన ఓ ఫోటోని షేర్‌ చేసిన సునీత.. ”మావయ్యా.. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. మీ పాట వినాలనుంది. మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ చెమర్చిన కళ్లతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది. మీరు మమ్మల్ని వదిలివెళ్లి అప్పుడే సంవత్సరం కావొస్తోందంటే నమ్మడం కష్టంగా ఉంది. ఎప్పటికీ మీరే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూసుకుంటావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా.. బతికేస్తున్నా..!” అని సునీత పోస్ట్‌ పెట్టారు.