NEET ఫలితాల ప్రకటనకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నీట్‌ యూజీ ఫలితాలు ఇవ్వొద్దని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితాలను ప్రకటించాలని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను ఆదేశించింది.

ఈ ఏడాది సెప్టెంబరు 12న నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలో ఈ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థుల టెస్టు బుక్‌లెట్‌, ఓఎంఆర్‌ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయి. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. నీట్ ఫలితాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అంతేగాక, ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై ఎన్‌టీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితాల ప్రకటన ఆలస్యమైతే అది వైద్య విద్యలో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

ఎన్‌టీఏ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ”ఈ ఫలితాల కోసం 16లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కేవలం ఇద్దరి కోసం ఫలితాల విడుదలను ఆపలేం. అందుకే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం. ఎన్‌టీఏ ఫలితాలను ప్రకటించొచ్చు. ఆ ఇద్దరు విద్యార్థుల సమస్యను మళ్లీ పరిశీలిస్తాం” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో నీట్‌ ప్రశ్నపత్రం బయటకు పొక్కిందన్న ఆరోపణలు రావడంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ కొందరిని అరెస్టు చేసింది కూడా. ఆ విచారణలో ఏం తేలిందనే సమాచారం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఇదే సమయంలో నీట్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.