తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. ప్రముఖులు సంతాపం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి  కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నిన్న ఒక్కసారిగా అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన పలువురు ప్రముఖులు గవర్నర్‌కు సంతాపం తెలిపారు.

మాతృమూర్తి వియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. గవర్నర్‌ మాతృమూర్తి కృష్ణకుమారి మృతి పట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ దంపతులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణకుమారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్‌కు, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ మాతృమూర్తి కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు దైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.