క్రేన్ ప్రమాదంలో వలస కార్మికుల మరణం దురదృష్టకరం

నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ ఉదయం జరిగిన క్రేన్ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగించింది. క్రేన్ సహాయంతో కార్మికులు పంప్ హౌస్ లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్ తెగిపడి కార్మికులు పంప్ హౌస్ లో పడిపోవడం మానవ తప్పిదమా? యాంత్రిక లోపమా? ప్రభుత్వం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఉపాధి కోసం బయటకు వెళ్లిన వారు శాశ్వతంగా తిరిగి రాకపోతే ఆ కుటుంబం అనుభవించే క్షోభను మనం ఊహించలేం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు రాకుండా అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని జనసేనాని అన్నారు.