‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ ప్రారంభించిన మంత్రి

ఐటీ, పురపా లక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘స్మైల్‌ ఏ గిఫ్ట్‌’లో భాగంగా అందజేసిన నాలుగు అంబులెన్స్‌లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం(ఆర్‌అండ్‌బీ)లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా బాధితుల కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 14 అంబులెన్స్‌ వాహనాలను ఎమ్మెల్యేలు, మేయర్‌ తదితరులు కలిసి ఇచ్చారన్నారు. వీటిని ఇటీవలే కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించామని అన్నారు.

అయితే వరంగల్‌లో శనివారం నాలుగు వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీటిలో భూపాలపల్లి, జనగామ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున, పాలకుర్తి నియోజకవర్గానికి రెండు వాహనాలు ఉన్నాయన్నా రు. ఈ వాహనాలను భూపాలపల్లికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామకు వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, పాలకుర్తికి వొద్దిరాజు రవిచంద్ర, సంతోశ్‌రెడ్డి ఇచ్చారన్నారు. వారికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మిగతా వాహనాలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఎర్రబెల్లి వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.