మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఫోన్ చేశారు. ఇటీవల దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడటం గమనార్హం. ఇజ్రాయిలీ ప్రతినిధులను రక్షించేందుకు కృషిచేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద స్వల్ప పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి కూడా ఇరు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మరోవైపు, రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు కేసులో నిందితులను పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.