ప్రపంచానికి భారత్‌ అండగా నిలిచింది.. ఇప్పుడు భారత్‌కు సాయం చేయాల్సిన సమయం: బ్రిటన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌

కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సహకారం అందించాలని ప్రజలకు బ్రిటన్స్ ప్రిన్స్‌ చార్లెస్‌ పిలుపునిచ్చారు. యావత్తు ప్రపంచం కష్ట సమయంలో ఉన్నప్పుడు భారత్‌ అండగా నిలిచిందని.. ఇప్పుడు భారత్‌కు సాయం చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభణతో గడ్డుకాలం ఎదుర్కొంటున్న భారత్‌కు ఏదైనా సాయం చేయాలని తాను స్థాపించిన బ్రిటీష్‌ ఏషియన్‌ ట్రస్ట్‌ నిర్ణయించిందని చార్లెస్ తెలిపారు.

భారత్‌పై తనకున్న ప్రేమను చార్లెస్‌ ఈ సందర్భంగా మరోసారి వ్యక్తపరిచారు. ఈ సంక్షోభంలో భారత్‌కు అండగా ఉండాలని భావోద్వేగ ప్రకటన చేశారు. భారత్‌ను తాను అనేకసార్లు సందర్శించానని గుర్తుచేసుకున్న ప్రిన్స్‌.. కరోనా మహమ్మారిపై భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన స్థాపించిన బ్రిటీష్‌-ఏషియన్‌ ట్రస్ట్‌ భారత్‌లోని ఆసుపత్రుల అత్యవసర పరిస్థితుల అవసరాల్ని తీర్చేందుకు ‘ఆక్సిజన్‌ ఫర్‌ ఇండియా’ పేరుతో లక్ష పౌండ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.