ప్రారంభమైన తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నెల్లూరు డీకే డబ్ల్యు కాలేజిలో జరుగుతుండగా.. తిరుపతి ఎస్వీయూలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ ల కౌంటింగ్ జరుగుతుంది. ఆర్ఓ చక్రధర్ బాబు నెల్లూరు కేంద్రంగా రౌండ్ల వారిగా ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 17 లక్షల 10 వేల ఓట్లకు గాను.. 10 లక్షల 90 వేల ఓట్లు పోలయ్యాయి. 64.42 శాతం పోలింగ్ ఈ ఎన్నికలో నమోదయ్యింది.

ఇక అధికారులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు ఇప్పటికే కరోనా టెస్టులు పూర్తయ్యాయి. నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని మాత్రమే లోపలకు అనుమతి ఇచ్చారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు మొత్తం 3314. అనంతరం ఈవిఎంలలో ఓట్లను లెక్కించనున్నారు.

సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు కోసం మూడు హాల్స్ కేటాయించగా.. తిరుపతి సెగ్మెంట్ కోసం నాలుగు కౌంటింగ్ హాల్స్, సూల్లూరుపేట సెగ్మెంట్ కోసం ఒక కౌంటింగ్ హల్, గుడూరు, వెంకటగిరి, సర్వేపల్లి కోసం రెండు చొప్పున కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో 28 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇక కౌంటింగ్ సందర్భంగా నెల్లూరులో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. కొవిడ్ నేఫథ్యంలో విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధం కాగా.. ఫలితాలు వెల్లడయ్యాక గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్దకు అనుమతి ఉంది. ఇక కనిష్టంగా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్‌ 14 రౌండ్లుల్లో పూర్తి కానుండగా.. గరిష్టంగా సూల్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్ 25 రౌండ్లులలో పూర్తి అయ్యే అవకాశం ఉంది.