స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై తాత్కాలిక నిషేధం విధించిన రెజ్లింగ్ సమాఖ్య

టోక్యో ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకం సాధిస్తుందని భావించిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ నిరాశ పరిచింది. అంతేకాకుండా, ఇప్పుడో వివాదంలో చిక్కుకుంది. ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యేందుకు హంగేరీ వెళ్లిన వినేశ్ ఫోగాట్ అట్నుంచి అటే టోక్యో చేరుకుంది. ఇతర రెజ్లర్లు భారత్ నుంచి టోక్యో వెళ్లారు. అయితే టోక్యో ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో వారితో కలిసి ఉండేందుకు వినేశ్ ఫోగాట్ నిరాకరించింది.

తాను హంగేరీ నుంచి వచ్చానని, వారు భారత్ నుంచి వచ్చారని, వారి నుంచి తనకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్నది వినేశ్ వాదన. వారితో కలిసి ఉండకపోగా, వారితో కలిసి ప్రాక్టీసు కూడా చేయలేదట. అంతేకాదు, మ్యాచ్ ల సందర్భంగా అధికారిక స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై ఆరోపణలు చేసింది.

ఈ క్రమంలో రెజ్లింగ్ సమాఖ్య భారత్ తిరిగొచ్చిన వినేశ్ కు నోటీసులు జారీ చేసి, తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 16 లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వినేశ్ తప్పు చేసినట్టు తేలితే మాత్రం శిక్ష తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.