శ్రీలంక పర్యటనకు భారత్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జూన్​18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్‌ తలపడుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు మరో భారత జట్టును శ్రీలంకకు పంపనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. లంక టూర్‌లో భారత్‌ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఈ సిరీస్‌ జూలై 13 నుంచి 25 వరకు జరగనుంది. మ్యాచ్‌లకు వేదికలను ఇంకా ప్రకటించలేదు.

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ త్వరలోనే జట్టును ఎంపిక చేయనుంది. పరిమిత ఓవర్ల పర్యటనకు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ రేసులో ఉన్నారు. గాయం నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిగా కోలుకుంటే అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొదటి దశలో సత్తాచాటిన భారత ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కే ఛాన్స్‌ ఉంది.